Monday, January 10, 2022

VIజయతీరాలను చేరాలని.. ‘సామాజిక’ ఫార్ములా!

 జయతీరాలను చేరాలని.. ‘సామాజిక’ ఫార్ములా!

Jan 11, 2022, 05:21 IST

Uttar Pradesh Election 2022: Social Engineers are the Brains behind Poll Campaigns All Partys - Sakshi

పార్టీల ప్రచార ప్రణాళికలో సోషల్‌ ఇంజనీర్లదే కీలక భూమిక


సమూహాలతో సంబంధాల బలోపేతం, కొత్త వర్గాలను ఆకర్షించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచార బాధ్యతంతా వీరిదే


బీజేపీ సోషల్‌ ఇంజనీరింగ్‌ బాధ్యతలు ధర్మేంద్ర ప్రధాన్‌కు అప్పగింత


బ్రాహ్మణులు చేజారకుండా జాగ్రత్తలు


ఎప్పటిలాగే సతీశ్‌ చంద్ర మిశ్రాపైనే బీఎస్పీ ఆశలు... ‘బహుజన్‌ టు సర్వజన్‌’ నినాదంతో ప్రజల్లోకి


యాదవేతర కులాలను దగ్గరికి తీసే పనిలో అఖిలేశ్‌


కాంగ్రెస్‌ తరఫున అన్నీ తానైన ప్రియాంకా గాంధీ


సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలన్నీ రాజకీయ వ్యూహాల్లో దిట్టలైన సామాజిక ఇంజనీర్లు(పొలిటికల్‌ సోషల్‌ ఇంజనీర్స్‌), వారు సిద్ధం చేసే సోషల్‌ ఇంజనీరింగ్‌ మీదే ఆధారపడి ఉంటోంది. పార్టీకి విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం చేయడం, సామాజిక సమూహాలు, వారి అవసరాలను గుర్తించడం, ఆపై పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం, సామాజిక మాధ్యమాల్లో సందేశాల ద్వారా పార్టీకి అనుకూలంగా వారిని సానుకూలంగా ప్రభావితం చేసే వ్యూహాన్ని సిద్ధం చేయడంతో సోషల్‌ ఇంజనీర్లే కీలక భూమిక పోషిస్తున్నారు.








దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ప్రతి పార్టీ సోషల్‌ ఇంజనీరింగ్‌ ప్రాధాన్యాన్ని బాగా గుర్తించాయి. సామాజిక సమీకరణ కోసం వివిధ కులాలు, వర్గాలు, మత సమూహాలతో తమ పార్టీలకు సంబంధాలను బలపరిచే, సామాజిక పొత్తులను నిర్మించగల శక్తిసామర్థ్యాలున్న నేతలను దీనికి వినియోగిస్తున్నాయి. వీరికి ప్రజాకర్షక శక్తి లేకున్నా.. తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టగల నేర్పు ముఖ్యం. హోంమంత్రి అమిత్‌ షా బీజేపీకి గొప్ప సోషల్‌ ఇంజనీర్‌ అనేది గత సార్వత్రిక, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది.


ప్రధాన్‌ నేతృత్వంలో బీజేపీ...

ప్రస్తుతం అమిత్‌ షా కేంద్ర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో యూపీ ఎన్నికల్లో సోషల్‌ ఇంజనీరింగ్‌ బాధ్యతలను సమర్థ్ధుడైన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ కట్టబెట్టింది. ప్రధాన సామాజికవర్గాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని వెంటనే గుర్తించి, వాటితో చర్చలు జరిపి, వారి ద్వారా అందే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పరిష్కారాలు చూపించే పనిని ప్రధాన్‌ బృందం సూక్ష్మస్థాయిలో చేస్తోంది. ముఖ్యంగా పూర్వాంచల్‌. తూర్పు యూపీలో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతోంది. రాజ్‌పుత్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న కినుకతో వారు ఎస్పీలో చేరుతున్నారు. దీంతో యూపీలో 14 శాతం ఉన్న బ్రాహ్మణులు దూరం కాకుండా కమలదళం చర్యలు చేపట్టింది.


లఖీంపూర్‌ ఖేరీ ఘటనలో బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాకు ఉద్వాసన పలకాలని ఎంత గట్టిగా డిమాండ్లు వచ్చినా, ఆ వర్గానికి ఆగ్రహం కల్గించరాదన్న ఉద్దేశంతోనే ఆయనకు బీజేపీ కాపు కాస్తోంది. మరోవైపు రాజ్‌పుత్‌ ఓట్లు జారిపోకుండా కీలక నేతలందరితో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల్లో ఎక్కువగా బీసీలు, ఎస్సీ వర్గాల వారే ఉండటంతో వారిని మచ్చిక చేసుకునేలా  ఇప్పటికే రూ.35 వేల కోట్ల రుణాలను అందించగా, 2.21 కోట్ల మంది రైతులను ఫసల్‌ బీమా యోజనలో చేర్చింది. వీటన్నింటినీ బీజేపీ బృందాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి.

 


బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షిస్తున్న ఎస్పీ

ఇక యూపీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కోవాలని గట్టి పట్టుదలతో ఉన్న విపక్షాలు సైతం తమతమ సోషల్‌ ఇంజనీరింగ్‌కు పదునుపెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ కోసం అఖిలేశ్‌ యాదవ్‌ సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహాన్ని రచిస్తున్నారు. మహాన్‌ దళ్, సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ వంటి యాదవేతర కుల ఆధారిత పార్టీలతో పొత్తులు ఏర్పరచుకోవడం ద్వారా వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే యత్నాలకు దిగారు. ముఖ్యంగా బీజేపీ అనుబంధంగా ఉంటున్న బ్రాహ్మణులకు దగ్గరయ్యేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే బ్రాహ్మణ వర్గానికి చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్‌ పాండేని పార్టీలో చేర్చుకున్నారు. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 ఓట్లు సాధించడంలో ఓబీసీలు, ముస్లిం, వైశ్యులు కీలకంగా ఉన్నారు.


19 శాతంగా ఉన్న ముస్లింలకు 2017లో అధిక సీట్లు కేటాయించినా, కేవలం మూడో వంతు మాత్రమే ఎస్పీ నుంచి గెలిచారు. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. ఈ దృష్ట్యా ముస్లింల ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ సలీమ్‌ షేర్వానీని ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, కొత్తగా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఇమ్రాన్‌ మసూద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలేశ్‌ ఇటీవల నిర్వహించిన విజయ్‌ రథయాత్రకు ముస్లిం ఓటర్లు ఎక్కువగా హాజరయ్యేలా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక పశ్చిమ యూపీలో జాట్‌ల మద్దతు కూడగట్టేందుకు ఆర్‌ఎల్‌డీతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది. ఓబీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు  ఆయన బీసీ కులగణన అంశానికి మద్దతిస్తున్నారు.  


రిజర్వ్‌డ్‌ స్థానాలతో పాటు ముస్లిం ఓట్లపై కన్నేసిన బీఎస్పీ

ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ కోసం సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర మిశ్రా రూపొందిస్తున్నారు. బ్రాహ్మణులతో సహా దళితేతర కులాల నుండి వీలైనంత ఎక్కువ మంది మద్దతు పొందే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ’బహుజన్‌ టు సర్వజన్‌’ అనే నినాదం ఆధారంగా ఆయన వ్యూహాలున్నాయి. గతంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో 86 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీఎస్పీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానాల్లో పార్టీ నేత సతీశ్‌చంద్ర శర్ము రెండుసార్లు పర్యటించి వచ్చారు. ఇదే సమయంలో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఎస్పీ వైపునకు వెళ్లకుండా 2012–17 మధ్య అఖిలేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో 134 చోట్ల మతకల్లోల సంఘటనలు జరిగిన అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.


‘ఆడపిల్లను... పోరాడగలను’

యూపీలో కాంగ్రెస్‌ ప్రాబల్యం నానాటికీ తగ్గుతూ వస్తోందనేది అక్షరసత్యం. 2019లో కాంగ్రెస్‌ కంచుకోటగా భావించే అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలపడానికి ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నారు. స్వయం సహాయక బృందాలు, ఇతర మహిళా సంస్థలతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ వారి మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నారు.‘లడ్‌కీ హూ..లడ్‌ సక్తీ హూ’ నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు.


నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, మహిళలకు 40 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎస్పీ లేదా బీజేపీ హామీ ఇవ్వగలవా? అని ప్రశ్నిస్తున్నారు.  ఇక రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధ్యక్షుడు జయంత్‌ చౌదరి జాట్‌లు అధికంగా ఉండే పశ్చిమ యూపీలో తన ప్రాబల్యాన్ని నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ తికాయత్‌తో సంబంధాలు నెరుపుతున్నారు. ముస్లిం–జాట్‌ కాంబినేషన్‌ సైతం మంచి ఫలితాలిస్తాయని ఆశిస్తున్న జయంత్‌ చౌదరి ఎస్పీతో పరస్పర అంగీకారం దిశగా చర్చలు చేస్తున్నారు.




​ఒకటికి రెండు యుద్ధాలు!

Jan 11, 2022, 00:02 IST

Editorial About 5 State Elections Key BJP-Central Election Commission - Sakshi

దేశంలో మినీ ఎన్నికల సమరానికి తెర లేచింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలు అయిదింటికీ ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఎన్నికలు అధికార పక్షానికే కాదు... కేంద్ర ఎన్నికల సంఘానికీ ఇప్పుడు అగ్నిపరీక్ష. అయిదు రాష్ట్రాల్లో నాలుగింట అధికారంలో ఉన్న బీజేపీ ఆ పట్టును నిలబెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటే, ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న వేళ ఈ తాజా భారీ ఎన్నికల కసరత్తు ఎన్నికల సంఘానికి కత్తి మీద సాము కానుంది. ఈ 7 విడతల ఎన్నికలలో మెగా ర్యాలీలు కనిపించేలా లేవు. దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పూర్తిగా డిజిటల్, వర్చ్యువల్‌ ప్రచారాలే శరణ్యం కావచ్చు. 





70 దేశాల్లో ఎన్నికలు వాయిదా పడ్డా, మన దగ్గర నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగాల్సిందేనని పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాక, ఎవరైనా చేసేది ఏముంది! దేశవ్యాప్తంగా 4.72 లక్షల యాక్టివ్‌ కరోనా కేసులు, రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతం ఉందనగా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 2 విడతల్లో, గోవా– పంజాబ్‌ – ఉత్తరాఖండ్‌లలో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది.  


ఫిబ్రవరి 10న మొదలై మార్చి 10న కౌంటింగ్‌ దాకా సాగే ఈ యుద్ధంలో చిత్రవిచిత్రాలు తప్పవేమో! ఎన్నికల సంఘం అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 లక్షల నుంచి 40 లక్షలకు పెంచింది. కానీ మారిన లెక్కలు, ఇప్పుడీ కొత్త డిజిటల్‌ వ్యూహాల నేపథ్యంలో ఆ వ్యయంతో సాధ్యమా అన్నది సందేహమే! అలాగే, నీతి ఆయోగ్‌ లెక్క ప్రకారం ప్రతి 100 మందిలో 39 మందే నెట్‌ వినియోగ దారులు, గ్రామాల్లో వందకు 4 ఇళ్ళలోనే కంప్యూటర్లున్న యూపీ లాంటి చోట్ల డిజిటల్‌ అంతరాలను పార్టీలు ఎలా నెగ్గుకొస్తాయో!


పండుగలు, ఉత్సవాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమనీ, వారిని కాపాడాలనీ కలకత్తా హైకోర్ట్‌ సహా పలువురు కుండబద్దలు కొట్టారు. అలహాబాద్‌ హైకోర్ట్‌ ఏకంగా యూపీ ఎన్నికలే వాయిదా వేస్తే మేలు అంది. తీరా పశ్చిమ బెంగాల్‌ లాంటి చోట్ల గంగా సాగర్‌ మేళాలకూ, తమిళనాట సంక్రాంతికి ఎడ్లను లొంగదీసే జల్లికట్టు ఉత్సవాలకూ తోటి పాలకులే గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం విడ్డూరం. అలా ఇటు ప్రజలు కానీ, అటు రాజకీయ పార్టీలు కానీ రకరకాల వేరియంట్ల కరోనాతో చెలగాటానికే సై అనడం విచిత్రం. ఆ మాటకొస్తే, ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని భౌతిక ఎన్నికల ర్యాలీలపై ఈ జనవరి 15 వరకు నిషేధం విధించేదాకా బీజేపీ, ఎస్పీ సహా అన్ని పార్టీలూ ఎడాపెడా బహిరంగ సభలు పెట్టినవే! నిషేధం కన్నా ముందే యూపీ పాలకులు తెలివిగా ప్రధాని సహా పార్టీ పెద్దలందర్నీ దింపి, కొద్ది వారాలుగా ఎన్నెన్ని ప్రారంభోత్సవాలు, సభలు పెట్టారో తెలిసిందే. 


మాయావతి సారథ్యంలోని బీఎస్పీ స్తబ్ధుగా మారడంతో, 15 కోట్ల మంది ఓటర్లు – 403 సీట్ల యూపీలో ఈసారి ప్రధానంగా బీజేపీ, ఎస్పీల మధ్య పోరు ఉంటుందని అంచనా. 1985 తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండు సార్లు గద్దెనెక్కని ఈ రాష్ట్రంలో కులం, మతం, అభివృద్ధి, కరోనా కీలకాంశాలు కానున్నాయి. 21.3 కోట్ల మంది ఓటర్లున్న 117 స్థానాల పంజాబ్‌లో ‘ఆప్‌’, బీజేపీలతో పోరాడుతూ అధికారం నిలబెట్టుకొంటే కానీ జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు పరువు దక్కేలా లేదు. ప్రత్యర్థులతో పాటు సిద్ధూ ఇంటిపోరు ఆ పార్టీకి అదనపు బరువైంది. ఉత్తరాఖండ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రులను మార్చాల్సి రావడం, మణిపూర్‌లో ముఠా తగాదాలు ఎక్కువ కావడం బీజేపీకి ఉన్న తలనొప్పులకు నిదర్శనం. సాధారణంగా స్థానిక అంశాలు ప్రాధాన్యం వహించే గోవాలో ఈసారి తృణమూల్, ‘ఆప్‌’ల రంగప్రవేశంతో ఎన్నికల చిత్రం సంక్లిష్టమైంది. 


ఈ పరిస్థితుల్లో కరోనాపై పోరుకు తోడు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడడం ఎన్నికల సంఘానికి సవాలు. యూపీలో అధికార పార్టీ కార్యకర్తల లాగా పనిచేస్తున్న అధికారుల్ని పక్కకు తప్పించాలని ఎస్పీ డిమాండ్‌ చేసింది. అధికార, పోలీసు యంత్రాంగం రాజకీయమయం అయిందంటూ రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని డిమాండ్లు వివిధ రాష్ట్రాల్లో రావడం ఖాయం. ఇక, స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘానికి ఆ మధ్య ఢిల్లీ పాలకుల నుంచి వచ్చిన భేటీ పిలుపుపై విమర్శలొచ్చాయి. దాంతో, స్వతంత్రతనూ, సచ్ఛీలతనూ నిరూపించుకోవాల్సిన అదనపు బాధ్యతా ఎన్నికల సంఘంపై పడింది.


నేర చరిత ఉన్న వ్యక్తిని పార్టీలు అభ్యర్థిగా ఎంచుకుంటే, ఎందుకలా చేసిందీ 48 గంటల్లో తమకు చెప్పాలని సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల మార్గదర్శకాలు ఏ మేరకు అమలవుతాయో, గూండాలకు టికెట్లివ్వకుండా పార్టీలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 2020 బీహార్‌ ఎన్నికల్లో వర్చ్యువల్‌ ప్రచారంలో ఆరితేరిన బీజేపీకి దీటుగా వనరులు, సాంకేతికతలో ఇతర పార్టీలకు సమతూకం నెలకొల్పడం ఎన్నికల సంఘానికి ఎంత వరకు సాధ్యమో చెప్పలేం. 


ఏమైనా, కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత సెకండ్‌ వేవ్‌లో నిర్లక్ష్య వైఖరితో పాలకులు, ప్రజలు తప్పు మీద తప్పు చేశారు. నిరుడు ఏప్రిల్‌లో తమిళనాడు, బెంగాల్‌ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు, ప్రచారాలు కరోనా మహా వ్యాప్తికి కారణమయ్యాయి. ఆ ఎన్నికల తర్వాత మేలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు మీద పడ్డాయి. ఇప్పుడు మొన్న డిసెంబర్‌ నాటి 5 వేల చిల్లర నుంచి పెరిగి, తాజాగా రోజూ లక్షకు పైగా కేసులొస్తూ, థర్డ్‌వేవ్‌ పడగ విప్పింది. ఈ ఎన్నికల్లో మళ్ళీ నిర్లక్ష్యం చూపితే పర్యవసానాలేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పార్టీలు, ప్రజలు, చివరకు ఎన్నికల సంఘమైనా పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తే అంతకన్నా ఘోరం, నేరం ఉండదు!

No comments:

Post a Comment